ఈ నెల 15, 16వ తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

  • ఢిల్లీలో సీఎం చంద్రబాబు రెండ్రోజుల పర్యటన
  • కేంద్రమంత్రులతో భేటీలు
  • రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై చర్చ
  • ఈ నెల 17న రాష్ట్రానికి తిరిగి రాక
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా  వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై సీఎం వారితో చర్చించనున్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తదితరులతో సీఎం తన ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి కూడా ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చలు జరుపనున్నారు. 

జులై 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరుగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు.

జులై 16వ తేదీన కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం నార్త్ బ్లాక్ లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి హాజరవుతారు. 17వ తేదీ ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు  ఢిల్లీ నుంచి అమరావతి బయలుదేరుతారు.

Chandrababu Naidu
Andhra Pradesh
Delhi tour
Amit Shah
Nirmala Sitharaman
Ashwini Vaishnaw
Central Funds
Polavaram Project
AP Projects
PM Museum

More Telugu News